Thursday, October 23, 2014

పత్తి పత్తి

ఎక్కడ చూసినా పత్తి పంటే. నేషనల్ హైవే వెంట నుండి మారుమూల చందంపేట లోపల పొగిళ్ళ దాకా పత్తి పంటే.     భూములన్నిటా  పత్తే పెడితే తిండి పండించడం ఎక్కడో? పత్తి ఎగుమతి చేసి తిండి గింజలు దిగుమతి చేసుకోవాలా?  గిరిజనుల సాంప్రదాయక ఆహారం జొన్న రొట్టె. చందంపేట మండలమైనా, దేవరకొండ మొత్తమైనా ఎక్కడా జొన్న చేను కనపడదు. మహారాష్ట్ర నుండి లారీల కొలది దిగుమతి చేసుకొంటారట .

ఎందుకు ఇంత పత్తి ? ఇన్ని బట్టలు కావాలా? వనరులను పొదుపుగా వాడుకోవాలి. పెట్టుబడులు లాభాలు నష్టాలు లెక్కలు ఎక్కువైపోయి ఆత్మహత్యలు.

పెసర చేలు కూడా కంటికి కనపడడం లేదు. ఏం తిని బతుకుదామో అర్ధం కాదు. ఆ పంట కొంత ఈ పంట కొంత ఇలా రకరకాల పంటలు వేస్తే ఎదో ఒక్కటైనా ఆదుకోక పోదు. వైవిధ్యం అవసరం. 

Wednesday, October 8, 2014

స్వచ్ఛ భారత్ తరుణం

ఎన్నో మార్పుల్ని, ఎంతో అభివృద్ధిని చూస్తున్న మనం పారిశుధ్యం  విషయంలో మార్పు కొరకు కృషి చేయాల్సిన తరుణం ఇదే. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు స్పందిద్దాము.

గ్రామీణ మంచినీరు - పారిశుధ్య శాఖలోనే పనిచేస్తున్న నేను పథకము అమలు విషయంలో కొన్ని అనుభవాల్ని అందరితో పంచుకోదలచాను. మరుగుదొడ్డి కట్టుకోవడానికి ప్రభుత్వ సబ్సిడీ పంపిణి విషయమై విధానాలను మాటి మాటికి మార్చడం వలన పెద్ద గందరగోళం తయారౌతుంది. ఒక వేవ్ కి ఇంకో వేవ్ కి మధ్య కట్టుకొన్న వాళ్ళు అటూ ఇటూ కాక సబ్సిడి రాక పాత దొడ్డి చూపించి సబ్సిడీ ఇవ్వమంటారు. ఒక్కనికి పాతదానికి ఇస్తే అందరూ ఇంకోసారి తీసుకోవడానికి ఎగబడతారు. అమలు చేసే యంత్రాంగం ఈ నెత్తి నొప్పి, బ్లాక్ మెయిళ్ళు భరించ లేక చేతులెత్తేసి కాలం గడిపేస్తున్నారు. కాబట్టి చాలా పకడ్బందీ గా సంకల్ప శుద్ధితో, పూర్తిగా అయిపోయేదాకా వెంట పడితేనే ఫలితం ఉంటుంది.


పారిశుధ్య విద్య కుడా అవసరం. విద్యాలయాల్లో పారిశుధ్య పరిస్థితులు ఘోరం. దానికి అందరిదీ బాధ్యత. మొదలు దాన్ని మంజూరి చేసేప్పుడే సరిపోను నిధులు మంజూరి చేయక, చవకగా ఎలా కట్టాలో ముష్టి సలహాలు మోడల్స్ ఇచ్చి కట్టమంటారు.  చాలా గట్టిగా, ధృఢంగా కడితేనే మన వాళ్ళతో ఆగవు. సస్తాలో కట్టాలని చూస్తే అవి వెంటనే  మూలకు పడతాయి. వాటికి నీటి సరఫరా కావాలి. పాఠశాలకే బోరు మోటరు ఇస్తే కరెంటు బిల్లు, రిపేర్లతో హెడ్మాష్టర్లకు నెత్తి నొప్పి. స్వీపర్లకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి.  గ్రామ పంచాయతీ నల్లాలో ఓట్లున్న వారికి, నోరున్న వారికే నీళ్ళు అందుతాయి.  అదీ ఏ రాత్రో, ఏ జామో.

పాడైన వాటిని తిరిగి శుభ్రం చేయించడానికి మనుషులు ఎవరూ దొరకరు.  ఎవరి పాఠశాలను వారే అక్కడి విద్యార్ధులు, ఉపాధ్యాయులు అందరూ వంతులు వేసుకొని శుభ్రం చేయాలి. ఈ విషయం ఇలా చెప్పిన అధికారిణి ని గత ప్రభుత్వం తప్పు పట్టి ఆ పోస్టు నుండి తప్పించినట్లు గుర్తు. ఈ విషయంలో స్పష్టత లేకుంటే ఎన్ని కట్టించినా నిష్ప్రయోజనమే.

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, చోటా నాయకులకు కాట్రాక్టులు చేసుకోవడానికి ఊళ్ళల్లో సిమెంటు రోడ్లు బాగా ఉపకరిస్తాయి. టాయిలెట్లు పూర్తిగా కట్టుకొన్న ఊరికే సిమెంటు రోడ్లు మంజూరి చేసే నిబంధనని అమలు చేయడం కష్టమేమీ కాదు.  అసలు సి.సి. రోడ్లకు పెట్టిన పైసల్లో పావు వంతు టాయిలెట్లకు పెట్టినా  అన్నీ పూర్తి అయ్యి ఉండేవి.

ప్రభుత్వం నడుం కట్టి బాధ్యతగా చేయవలసిన మరో పని - ప్లాస్టిక్ కవర్ల నిషేధం లేదా నియంత్రణ.



Sunday, August 17, 2014

సర్వే - సర్వజన హితం

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న  నిర్వహించ తలపెట్టిన సర్వే గురించిన చర్చ ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది. వ్వక్తుల స్వేచ్ఛకి ఏదో అయిపోతుందనే భయాలు కొందరు దురుద్దేశ పూర్వకంగానే ప్రచారం చేస్తున్నారు. ఈ భయాలు అర్ధరహిత మైనవి. ప్రభుత్వాల నుండి మంచి సేవలను ఆశించే వారెవరైనా దీన్ని వ్వతిరేకించడం తగదు.

బీద వారికి మాత్రమే ప్రభుత్వ సహాయం అందించడానికి ఇది పనికి వస్తుంది. బ్యాంకు అక్కౌంట్ల నెంబరు అడిగినంత మాత్రాన వ్యక్తుల ఆదాయమంతా కూడా తెలిసి పోడు. ఈ నెంబర్లు కావాలంటే, ఆ ఖాతాల్లో ఉన్న డబ్బు తెలుసుకోవాలనుకొంటే ప్రభుత్వము నేరుగా బ్యాంకులను సంప్రదించి కూడా తెలుసుకో వచ్చు. ప్రభుత్వాలు సరిగ్గా సేవలు అందించక పోతే డబ్బులు ఉంటే మాత్రం ఏమి ప్రయోజనం? కార్లు కొనగానే సారా? నడపడానికి మంచి రోడ్డు ఉండాలి కదా.

వ్యక్తుల ప్రాంతీయత గురించిన కాలమ్స్ ఏవీ ఈ సర్వే ఫారంలో లేవు. అందుకని ఏదో అయిపోతుందనే అపోహ అవసరం లేదు. కాబట్టి అందరూ దీనికి సహకరించాలి. ఇది ఆహ్వానించ దగినది. 

Friday, May 9, 2014

మన రాజకీయాలు తయారు చేస్తున్న అభివృద్ధి నమూనాకి ఉదాహరణలు.

అభివృద్ధో అభివృధ్ధి అని గోల పెడుతున్నాం కదా! యేమిటది అని యెవరినైనా చిన్న నాయకుడిని అడిగితే ఊళ్ళల్లో సి.సి. రోడ్లు వేయడం, స్కూలు బిల్డింగులు కట్టడం, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడం. ఇలా నిర్మాణాల్ని చూపిస్తారు. అదే అభివృధ్ధి అని చెబుతారు. ఇన్ని లక్షలు, కోట్లు వెచ్చిస్తున్నాం అని లెక్కలు చెబుతారు.

ఈ నిర్మాణాలే నిజంగా అభివృధ్ధా?  నేనొక మండలాధ్యక్షునితో వారి గ్రామానికి వారి కారులో వెళ్ళాను. కష్టపడి ఊళ్ళో సిసి. రోడ్లు వేయించాడు. కారు వెళ్ళడానికి బాగానే ఉంది. కానీ  గ్రామ సమీపానికి రాగానే కారు అద్దాలు ఎత్తండి ఎత్తండి అని నాకు కంగారుగా చెప్పారు.  ఎందుకంటే ఊళ్ళో టాయిలెట్లు లేవు. బహిరంగ మల విసర్జనతో   కంపు వాసన రాకుండా ఉండడానికి అద్దాలు ఎత్తమని చెబుతున్నాడు.

గ్రామంలో నీటి సరఫరాకి మొదటగా నీరు బాగా ఊరే వనరు కావాలి. తర్వాత ఆ బోరు / బావి నుండి నీరు సరఫరా చేసే మోటర్లు, పైపులైన్లు, ట్యాంకులు వగైరాలు కావాలి. బోరు, దానికి విద్యుత్తు లైను, మోటారు, పైపులైన్లు ఈ క్రమంలో పూర్తి అయిన తర్వాతే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలి. కానీ ఓవర్ హెడ్ ట్యాంకు ఒక ప్రతీక. మేము ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించాము అని ఘనంగా చెప్పుకోవడానికి పనికి వస్తుంది.  ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తే లాభాలు కూడా బాగా ఉంటాయి కాబట్టి వనరు సరిగ్గా ఉన్నా లేకున్నా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలకు డిమాండ్. దానితో ట్యాంకులు కనపడతాయి కానీ ఊళ్ళో నీళ్ళు దొరకవు.

గ్రామాల్లో పాఠశాల భవనాల నిర్మాణం కూడా అంతే. దానిలో బోధించే ఉపాధ్యాయులు సరిపడా ఉండాలి. వారి బోధన మీద నమ్మకం కలిగి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపాలి. వారికి చదువు అబ్బాలి. ఇదీ అసలు అభివృద్ధి క్రమము. కానీ మన రాజకీయాలు భవనాల నిర్మాణం చుట్టూ, దాని కాంట్రాక్ట్ చుట్టూ తిరుగుతుంటాయి. భవన నిర్మాణాన్ని అభివృధ్ధి ప్రతీకగా చూపుతుంటారు కానీ దానిలో పిల్లలే ఉండరు.

లాభాలొచ్చే నిర్మాణాలని అభివృధ్ధి  ప్రతీకలుగా చూపిస్తూ ఉంటుంది మన రాజకీయ అభివృధ్ధి నమూనా. దాని మాయలో అందరూ పడిపోతారు. పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు కూడా అంతే. బృహన్నిర్మాణాలన్నీ పెద్దోల్ల అభివృధ్ధి కొరకే. ప్రతీకలు చూపించి మోసపుచ్చుతున్నారు. ఆ స్పృహ జనాలకు కలిగించాలి. ఈ ప్రతీకల మీద ఎంతో ప్రజాధనం ఖర్చు అవుతుంది కానీ జీవన ప్రమాణాలు మెరుగు పడడం లేదు.

నిర్మాణాలు ప్రధానం కాదు. సి.సి. రోడ్డు కాదు ముందు కావలసింది. పారిశుధ్యానికి ముందు మరుగుదొడ్డి కావాలి. సి.సి.రోడ్లకు పెట్టిన ఖర్చుతో ఎప్పుడో అందరికి మరుగుదొడ్లు కట్టించగలిగే వాళ్ళం. మరుగుదొడ్లు ఎందుకు కట్టించడంలేదు అంటే, దానితో మధ్య వాళ్ళకి ఏమీ లాభాలు లేవు కనుక. ఏది ప్రధానమో ఈ గోలలో వినిపించడం లేదు.

నిర్మాణాలు కావాలి. కానీ అవి మాత్రమే సరిపోవు. వాటిని పనిచేయించే వ్యవస్థలు పటిష్టంగా ఉండాలి.  ఈ నిర్మాణాలకు నిధులు గుంజుకొచ్చేనాయకులే మనకి హీరోలుగా కనిపిస్తున్నారు, కానీ వ్యవస్థను సవ్యంగా పనిచేయించే శాసనాలను తయారు చేసే తెలివి, నిబద్దత  వారికి ఉందా లేదా అనేది చర్చనీయాంశం కాకుండా పోయింది.







Saturday, March 29, 2014

గుంజుకొచ్చేటోడే ఎమ్మెల్యే

మనకు మంచి ఎమ్మెల్యే యెవరయ్యా అంటే బాగా నిధులు గుంజుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటోడే. గంతనే. ఎమ్మెల్యే ఇంకేం జెయ్యాల? ఇదే అలవాటైపోయింది. అసలు మనము ఎమ్మెల్యేలని ఎందుకు ఎన్నుకొంటున్నామో మర్చిపోయినం.

బాగా అంటే బస్తాల కొద్దీ అన్నమాట. తీస్కరావాలె ఊళ్ళల్ల సి.సి. రోడ్లెయ్యాలె. టాయిలెట్లు లేకుంటెమాయె. ట్యాంకులు కట్టాలె. నీళ్ళు లేకుంటెమాయె.   నిధులు గుంజక రావడానికి ఆయన ఏ పాట్లైనా పడొచ్చు. ఆ గ్రూపు, ఈ గ్రూపు, వాణ్ణి బ్రతిమలాడి, వీణ్ణి బెదిరిచ్చి ఎట్లయితేనేమి గుంజక రావాలె. కుక్కల తీర్గ కొట్లాడాలె. గెల్వాలె.   ఇదీ జనంలో, సాధారణ కార్యకర్తల్లో ఉన్న అభిప్రాయం. లేకపోతే ఏం జేసిండయ్య అని శాపనార్ధాలు. 

వాళ్ళని విధాన సభకు విధానాల్ని రూపొందించే టందుకు పంపించిన సంగతే మర్చి పోతున్నం. వాళ్ళు అక్కడ సభలో కూర్చొని నిధులను మంజూరి చేయడానికి ప్రాతిపదికలు, ప్రాధాన్యాలను రూపొందించడానికి పంపించాం. అంతేగానీ కింద మీద బడి బస్తాలు నింపుకొని నియోజకవర్గానికి మోసుకొని రావడానికి కాదు. 

విధి విధానాలు పద్దతులు తయారు చేస్తే న్యాయంగా రావాల్సినవి వస్తాయి. తారతమ్యాలు ప్రాంతీయ బేధాలు ఉండవు. పెద్ద మంత్రి అయినాయిన అన్ని గుంజకపోంగ   చిన్న మంత్రిని అయిన నేనెందుకు గుంజక పోకూడదని తయారైనది. వాళ్ళు తయారు చేయాల్సిన ప్రాతిపదికలకు వాళ్ళే తూట్లు పొడుస్తారు. 

ఈ ప్రాతిపదికలు ప్రాధమ్యాలు గోంగూర కట్టలు అసలు తెలిసేది ఎందరికి. గెలిపించారు. వెళ్లారు. పార్టీలలో  పై వాళ్ళు ఏది చెబితే దానికి తలూపి బయటికి రావడమే మన వాళ్ళు చేస్తున్న పని. 

యెవడైనా పద్దతిగా ప్రాతిపదికలనే వెతుకుతూ కూర్చుంటాడో వాడొత్తి వాజెమ్మ అయిపోతాడు ఓటర్ల  దృష్టిలో. 


Friday, December 6, 2013

'ఆధార్' మీద రాళ్ళేయడం అవివేకం

బ్యాంకు ఖాతాలతో ఆధార్ నెంబర్ ని అనుసంధానించి, గ్యాస్ సబ్సిడీని నగదు రూపంలో జమ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. దాని కొరకు సామాన్యులు తిప్పలు పడుతున్నారు కాబట్టి ఆధార్ అనుసంధానం అవసరం లేదని కొందరి వాదన. కోర్టులకెక్కడం. రేషన్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డులుండగా ఇంకో ఆధార్ కార్డు ఎందుకని వాదన. ఆధార్  వ్యక్తిగత  గోప్యతని మంటగలుపుతుందని ఇంకొంతమంది నేర్చినవారి  వాదన.  కానీ అందరమూ తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే ఇంత పెద్ద జనాభా కలిగిన దేశానికి అది అవసరమే. దాన్ని ప్రవేశ పెట్టిన ఉద్దేశ్యం అర్దం కాకనే ఈ రాద్దాంతాలు.

కంప్యూటర్లతో సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, వివిధ లావాదేవీలను అనుసంధానం చేయడానికి, వ్యక్తుల ఆదాయాలను మధింపు చేసి పన్ను ఎగవేత, ఆర్ధిక నేరాలను పసిగట్టడానికి, నేరస్వభావం గల వ్యక్తుల కదలికలను పసిగట్టడానికి విశిష్ట గుర్తింపు సంఖ్య బాగా పనికి వస్తుంది. సమాచార సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించడం అంటే  ప్రభుత్వ పనికి ఒక కొత్త సునిశిత శక్తిని సమకూర్చుకోవడమే. ప్రభుత్వాల నుండి సమర్ధవంతమైన సేవలను డిమాండ్ చేస్తూ వాటి సామర్ధ్యాన్ని పెంచే పరికరాన్ని నిరాకరించడం వివేకం ఎలా అవుతుంది ?

రేషన్ కార్డు పౌర సరఫరాలకి, పాన్ కార్డు ఆర్ధిక లావాదేవీలకు, ఓటరు కార్డు ఓటు వేయడానికి గుర్తింపు, డ్రైవింగ్ లైసెన్స్ రవాణా శాఖకు ఇలా ప్రతిదీ దేనికదే ఆ శాఖ కార్యక్రమాల పరిధికే పరిమితమై ఉన్నాయి. కానీ మనిషి ఒక్కడే.  వీటన్నిటినీ అనుసాంధానించి వ్యవహారాలను నిర్వహించడానికి,  మధింపు చేయడానికి ఉద్దేశించిందే ఆధార్ నెంబరు.  అది సమాచార వ్యవస్థకు వెన్నెముక లాంటిది.

ఇక గోప్యత విషయానికికొస్తే , అసలు గోచీ గుడ్డలకే తడుముకొంటున్న వాళ్ళున్న దేశంలో  గోప్యత గురించి మాట్లాడడం అర్ధరహితం. సంపదను అక్రమంగా గోప్యంగా దాచుకోవడానికే  ఈ వాదన పనికి వస్తుంది.  దోచుకొనే వాడికి కూడా గోప్యత కావాలి. చిన్నల్లు మెయింటెయిన్ చేసే వాడికి కావాలి గోప్యత.  నెట్టింట్లో  ఉన్న వాళ్ళందరూ గోప్యత లేని వాళ్ళ కిందే లెక్క. ఇక కొత్తగా గోప్యతకు వచ్చే ముప్పేముంది?

వేలిముద్రలు సేకరించడం మీద కూడా ఆక్షేపణ ఉంది. కానీ తీవ్రవాదుల దాడులు జరిగినప్పుడు భద్రతా వైఫల్యమని విమర్శించేదీ మనమే. ప్రభుత్వాలు తమ సామర్ధ్యాలని పెంచుకోవడానికి , సమర్ధ సేవలు అందించడానికి ఆధార్ లాంటి పరికరము అవసరమే. కంప్యూటర్ల యుగంలో బూజుపట్టిన ఆలోచనలు పనికి రావు.

Friday, August 9, 2013

తెలుగు వాళ్ళకు రెండో రాజధాని ఇస్తామంటుంటే, దేశానికి రెండో రాజధాని అంటారేమిటి ?

ఇదెక్కడి గొడవండీ బాబూ.తెలుగు వాళ్ళకుఇంకో రాజధానిని ఇస్తామని పెద్దోళ్ళు అంటే సంతోషించాలి గానీ హైదారాబాద్ ని దేశానికి  రెండో రాజధానిని చేయాలని మాట్లాడతారేమిటి? మనకు ఇంకో ఇల్లు కట్టుకొనే అవకాశం వచ్చిందని సంతోషిస్తాం. దాన్ని ఎలా కట్టుకోవాలో ప్లాన్లు వేస్తాం. కలలు కంటాం. ఇదేంది.  యేం పాడైందని హైదారాబాద్ లో. అందరం యెగబడి ఖరాబు చేయడం కాకపోతే. రెండు మూడొందల కిలోమీటర్ల అనవసర ప్రయాణం తప్పితే.  కోట్ల రూపాయల ఫ్లాటు ఉండి యేం లాభం చుక్క నీరు దొరక్కుంటే. పేద్ద కారుంటే యేం లాభం దానికి తగ్గ రోడ్లే లేకుంటే. దాన్ని ఆపడానికి జాగానే లేకుంటే.  నిమిషానికి గజం వేగంతో కారులోనే పోవాలా.  యెవడు గుద్దుతాడో,  యెవనికి మనం గుద్దుతామో. టెన్షన్ తో నడపడమే కదా?  డబ్బులు గణించుకోవడమే కానీ జీవన నాణ్యత అవసరం లేదా?

కొత్త రాజధానిలో నైనా స్థలాలు, వ్యాపారాలు దొరుకుతాయి కదా. ఎక్కడ సెక్రటేరియట్ ఉండాలి. ఎక్కడ నివాసాలు ఉండాలి. పార్కులెక్కడ ఉండాలి. ఇవి ఆలోచించాలి. అన్ని రంగాలను ఇప్పటికైనా ఒకే చోట కుప్ప పోయకూడదనే తెలివిడి తెచ్చుకోవాలి. కొత్త రాష్ట్రానికి ఒకటి కాకపోతే రెండు రాజధానులు ఉండాలి. పరిపాలన వసతులు మాత్రమే అక్కడ నిర్మించుకోవాలి. విద్యా రంగం వేరే ఊళ్ళో , పారిశ్రామిక రంగం ఇంకొకచోట, ఐ.టి. పార్కులు ఒక టౌనులో ఇలా వికేంద్రీకరణ తప్పకా జరగాలి. లేకుంటే ఈ ఇరుకులు మురికి తప్పవు.

అసలు తెలుగువాళ్ళకు ఇదేం వెర్రి? అప్పుడేమో పోయి పోయి మద్రాసులో పడ్డారు. అసలు సినిమా రంగంలోని మెజారిటీ జనమంతా కృష్ణా, గోదావరి జిల్లాల వాళ్ళే కదా. యే రాజమండ్రిలోనో స్టూడియోలు నిర్మించుకోవచ్చు కదా? కళల కాణాచి పేరు సార్ధకమయ్యేది కదా? ఇప్పుడేమో హైదారాబాద్ లో పడి కొట్టుకులాడుతున్నరు.  కార్పొరేట్  విద్యా సంస్థలు కూడా మొదలు విజయవాడ, గుంటూరు, నెల్లూరుల్లో వెలిశాయి. అక్కడే ఉంటే పోక వాళ్ళూ హైదారాబాద్ దారి పట్టిరి. మనకు దగ్గరగా మనం పెట్టుబళ్ళు పెట్టుకొంటే లాభమే కానీ నష్టం ఉండదు కదా.

 ఇక ప్రభుత్వోద్యోగులకు ట్రాన్స్ఫర్లు తప్పవు కదా. అదీ తమ ఊరికి దగ్గరకి అంటే సంతోషించాలి. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సేవకు అందుబాటులో ఉండొచ్చు. బంధు మిత్రుల మధ్యన ఉండొచ్చు. ఎంతైనా సొంత ఊరిపై మమకారం ఉంటుంది కదా. ఉద్యోగాలు యేమీ తీసెయ్యరు కదా. యెందుకింత గొడవో అర్ధం కాదు.