Thursday, June 25, 2009

భారత ఐ.టి. రంగానికి సంతోషకరమైన వార్త

మన దేశ నాయకత్వానికి నిజంగా కృతజ్ఙతలు చెప్పాల్సిన రోజిది. దేశ ప్రజలందరికీ యూనిక్ గుర్తింపు నెంబరు కేటాయించడానికి ్‌యూనిక్ ఐడెంటిఫికేషన్ డేటాబేస్ అథార్టీ ఆఫ్ ఇండియ్ా ని ఏర్పాటు చేసి దానికి శ్రీ నందన్ నీలేకని గారిని దానికి ఛైర్మన్‌గా నియమించారు. 2011 కల్లా అందరికీ ఏకాంకిత గుర్తింపు నెంబరు కేటాయిస్తారు. తర్వాత అన్ని వ్యవహార లావాదేవీలలో దానిని ఉపయోగించడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను, సేవలను, సంక్షేమ పథకాలను సక్రమంగా , వేగవంతంగా , పారదర్శకంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది.

సంక్షోభంలో ఉన్న ఐ.టి. రంగానికి ఇది కొంత ఊరట.మనదేశ ఐ.టి. రంగం పూర్తిగా విదేశాలకు సేవలు అందించడానికే ఇప్పటివరకు పనిచేస్తూంది. వాళ్ళ టూత్ పేస్టులు, సబ్బుల లెక్కల దగ్గరినుండి అన్ని లెక్కలు మనమే నిర్వహిస్తూ వచ్చాము. మనం ఇప్పటినుండైనా మన లెక్కలు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. కనీసం ఇక్కడ మనుషుల లెక్కలు కూడా సరిగ్గా లేవు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి పని కొరకు వెళ్ళి టేబుల్ ముందు నిల్చున్నా నువ్వెవరో మాకు తెలియదు. నువ్వు బతికి ఉన్నావో చనిపోయావో కూడా తెలియదు. ప్రతీ దానికి సర్టిఫికేట్లు ఉంటే మాత్రమే నీ వ్యవహారం ముందుకెళుతుందని సమాధానం ఉంటుంది. ఈ గుర్తింపు, లెక్కలు ఝంజాటాలు పోవాలి. ఒక నెంబరు చెబితే ఒక వ్యక్తికి చెందిన అధీకృత సమాచారం మొత్తం నెట్‌వర్క్, డేటాబేస్‌ల ద్వారా సంగ్రహించే అవకాశం ఉండాలి.

కొంత కదలిక వచ్చింది. దేశంలో ఐ.టి. రంగంలో పనిచేసే వారందరూ దీన్ని గమనించాలి. అర్ధం చేసుకోవాలి. విమర్శించాలి. సూచనలివ్వాలి. ప్రభుత్వాలని డిమాండ్ చేయాలి. ఇంత జనాభా, వైశాల్యం గల మనదేశంలో ప్రభుత్వ సమాచారయాజమాన్యం అనేది చాలా పెద్ద పని. దానితో చాలా ఐ.టి. ప్రాజెక్టులు కొత్తవి వచ్చే అవకాశం ఉంది. మన ఐ.టి. నిపుణులకు మనదేశంలోనే మనపనిచేయడంలోనే ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. దీనిని స్వాగతిద్దాం.

Tuesday, March 31, 2009

మన అభివృద్ధి నమూనా పులిమీద స్వారీ చేయడంలాంటిదే

దేశాలకు ఆర్ధిక అభివృద్ది రేటు అనేది ఒక అగత్యంగా మారింది. పెరుగుదల రేటు ఉందంటేనే ఆ దేశం తన జనాభాకి ఉద్యోగావకాశాలను కల్పించగలుగుతుందని సాధారణ అభిప్రాయం. ఈ గ్రోత్ రేటు పెరుగుదల దేశాల ఆర్ధిక ఆరోగ్యానికి ప్రధాన సూచికగా మారింది. దీన్ని నిలబెట్టుకుందంటేనే ఆ దేశానికి ప్రపంచ మార్కెట్‌లో పరపతి ఉంటుంది. స్వదేశంలో కూడా ఆ ప్రభుత్వానికి విలువ ఉంటుంది. ఈ గ్రోత్ రేటుతో అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించలేకున్నా, కనీసానికి ఆ గ్రోత్ రేటుని చూపించి దేశంలో సంక్షోభం రాకుండా చూసుకోవచ్చు. ఈ గ్రోత్ రేటుని సాధించలేని దేశాలు, ప్రభుత్వాలు సంక్షోభాలకి బాగా దగ్గర ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు.

గ్రోత్ రేటు ఉన్నంత మాత్రాన పంపిణీ సమత్వం ఉంటుందన్న హామీ ఏమీ లేదు. పంపిణీ సమత్వం లేకున్నా కూడా గ్రోత్ రేటుని చూపించి ప్రభుత్వ విమర్శకుల నోర్లు మూయించ వచ్చు. ఇంక్లూజివ్ గ్రోత్ కొరకు పాటుపడుతున్నట్లుగా ప్రభుత్వాధినేతలు బుకాయించ వచ్చు. ఏదో రకంగా దాన్ని సాధించాలి. దేని పెరుగుదలనైనా ప్రభుత్వం ప్రోత్సహించాలి. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచడం నిజమైన పెరుగుదలగా చెప్పుకోవచ్చు. వైద్యసేవలు పెరగడం కూడా అనుకూలాంశమే. మద్యం వినియోగం పెరగడం కూడా పెరుగుదలేనని అనుకోవాలా? ప్రభుత్వం దృష్టితో చూస్తే అవుననే చెప్పాలి. ఏదైనా వినిమయం పెరగడం ప్రభుత్వానికి పన్నుల కొరకు, సమాజానికి ఉద్యోగాల కొరకు తప్పని సరి అవసరంగా మారాయి. వినిమయాన్ని తగ్గించడం, పొదుపును ప్రోత్సహించడం దేశ ద్రోహం కింద జమగట్టే రోజులొచ్చాయి.

సంక్షోభ సమయంలో ఉద్యోగాలు నిలబడాలంటే వినిమయం తగ్గకూడదు. వినిమయం పెరగాలంటే బ్యాంకులు ఇంకా వడ్డీరేట్లని తగ్గించాలి. ప్రభుత్వం ఇటు పరిశ్రమల వారిని ఉద్యోగులను తొలగించకుండా బ్రతిమాలుకోవాలి. వినిమయం పెరిగేలా డబ్బులు అందుబాటులో ఉంచమని అటు బ్యాంకులను బ్రతిమాలుకోవాలి. ఎన్ని కష్టాలు? ఈ వలయంలో అసలు విషయం తప్పిపోయింది. అసలు వినిమయం దేనికొరకు? మనిషి అవసరాలు తీరడానికి. కానీ ఇక్కడ వినిమయం దేనికొరకంటే ఉద్యోగాలకొరకనే అర్ధం వచ్చింది. తోక కుక్కని ఊపడమంటే ఇదే.

గ్రోత్ రేటుని నిలబెట్టుకోవడానికే మన దేశం ప్రపంచీకరణకు ద్వారాలు తెరిచింది. శాస్త్ర-సాంకేతిక ప్రగతి ఉత్పత్తి విధానాలలో ఊహించలేనన్ని మార్పులు తీసుకొచ్చింది. అది సాంప్రదాయక ఉత్పత్తి విధానాలను పూర్వపక్షం చేసింది. దానితో పాత సామాజిక సంబంధాలు కూడా పెద్ద కుదుపుకు లోనైనాయి. యాంత్రీకరణ వలన తక్కువ శ్రమతో లేదా అసలు మానవ శ్రమ అవసరం లేకుండా ఉత్పత్తి సాధ్యపడింది. ప్రగతిశీలమని భావించిన విద్య, ఉత్పత్తి ప్రక్రియలో సాంకేతికతకు మాత్రమే పరిమితమైపోయింది. సాంకేతికతను సాధించే కొద్ది అది మానవ శ్రమని, మానవ ప్రమేయాన్ని తగ్గించడానికే దారితీసింది. ఏ చదువైనా శ్రమని తగ్గించడానికేననే సూత్రం పైన ఆధారపడి ఉంది. చదివిన వాడు శ్రమ పడడం నీచంగా అనుకొని ఉద్యోగాలకొరకు వెతుకుతాడు. అప్పటి దాకా, అంతకు ముందు తనకు ముందరి తరం వాళ్ళు చేసే పని మొరటుగా అనిపించి దాని నుండి తప్పించుకో జూస్తాడు లేదా తనకు ముందరి తరం వాళ్ళు చేసే వృత్తులు యాంత్రీకరణతో కుదుపులకు లోనై, ప్రాధాన్యత కోల్పోయి, రూపం మారి, వృత్తి జీవితం జీవికకు సరిపోని స్థితి కూడా వచ్చి ఉండవచ్చు. శ్రమ పడడు కాబట్టి ఉద్యోగం కావాలి. ఉద్యోగానికెక్కి ఇంకొందరికి పనిలేకుండా చేసే టెక్నిక్‌ని ప్రాక్టీస్ చేయాలి. దేన్నో ఆటోమేట్ చేయడం కొరకే చదువుకొన్నవారి చాలా ఉద్యోగాలు నిర్దేశించబడింది.

నిరుద్యోగం పెరగకుండా చూడాలంటే ఇప్పుడు లగ్జరీ అనుకొనే ఉత్పత్తులని అందరికీ అత్యవసరాలుగ మార్చే సంస్కృతిని తయారు చేయాలి. లేదా ఇంకా కొత్త అవసరాలని, ఉత్పత్తులని కనుక్కోవడమే పరిష్కారం. కొత్త ఉత్పత్తుల కొరకు కొత్తగా వనరులు కావాలి. జనాభా పెరిగింది కానీ భూమి, వనరులు పెరగవు కదా. వనరులు ఏ మూలలో, ఏ లోతుల్లో ఉన్నా వెలికి తీయాలి. వినియోగించాలి. ఆ వనరులు ఎవరికైనా జీవనాధారాన్ని కల్పిస్తున్నప్పటికీ వారు దానిలో ఉత్పత్తి చేసే జిడిపి తక్కువ కాబట్టి ఎక్కువ జిడిపిని సాధించగల వర్గం చేతుల్లోకి వెళ్ళాల్సిందే.

సరిపోను ఆహారోత్పత్తి చేసి ఉద్యోగాలున్నా లేకున్నా అందరికీ ఉచితంగా ఆహారాన్ని అందించినప్పటికీ చదువు, కనీస అభివృద్ధి లేక జనన రేటు అదుపులో ఉండదు. ఇంకా పెరగబోయే జనాభాకి కనీసం ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి కూడా వనరులు సరిపోవు. కాబట్టి చదువు, కనీస అభివృద్ది అనేవి తప్పనిసరి. చదువు వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలి. ఉత్పత్తులు కావాలి.

జిడిపి అందరి అవసరం. పేదవానికి చదువు చెప్పించడానికి, ఆరోగ్యం కాపాడడానికి పన్నులు అవసరం. జిడిపి ఉంటేనే పన్నులు వస్తాయి. పేదవానికైనా, మధ్యతరగతి వానికైనా చదువు నేర్పిస్తే ఫలితం ఒక్కటే. జిడిపిని ఇంకొంత పెంచుకోవాల్సిన అగత్యాన్ని సృష్టించడమే. చదువుకొన్న తర్వాత అందరూ చేసే పని ఒక్కటే. ఇక్కడ పేదవాడు, పెట్టుబడిదారు అనే భేదం వాదనకే కానీ నిజానికి అందరికీ అగత్యమైన అభివృద్దే ఇది. పేదవాడు చదువుకొన్నా శ్రమని తప్పించుకొనడం, కొత్త టెక్నిక్‌ని కనిపెట్టడమనే ఆదర్శాలకొరకే పనిచేస్తాడు.

ఇప్పుడు ఇలా సంక్షోభం వస్తే కొన్నాళ్ళకు వనరుల కొరత, పర్యావరణ పరిమితులు సంక్షోభాలకు కారణాలు కానున్నాయి. మనం తలకెత్తుకొన్న అభివృద్ధి నమూనా పులిమీద స్వారీ చేయడం లాంటిదే. ప్రయాణం ఆపితే ప్రాణాలు దక్కవు.

సశేషం

Monday, February 23, 2009

ఆర్ధిక సంక్షోభంనుండి ఐ.టి. పరిశ్రమ బయటపడే మార్గం.

అమెరికాలో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం ప్రపంచ వ్యాప్తమై మన దేశం పైన కూడా పడింది. ఐ.టి. పరిశ్రమ మన దేశంలో 1992 నుండి చాలా మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది. దానితో ఎంతో సంపద కూడా మన ఆర్ధిక వ్యవస్థలోకి వచ్చింది. ఇప్పుడు సంక్షోభం వచ్చి క్రొత్తగా చదువుకొనే వారు నిరుద్యోగులయ్యే ప్రమాదం కనిపిస్తుంది.

తొంభయ్యవ దశకంనుండి కనీసం కొంత మందికైనా ఉద్యోగాలు దొరికాయంటే అది ఆర్ధిక సరళీకరణ, ప్రపంచీకరణ పుణ్యమే. లేకుంటే మనదేశంలో చదువుకొన్న నిరుద్యోగుల వలన ఎప్పుడో సంక్షోభం వచ్చి ఉండేది. ఆ సంక్షోభంలోనుండి గుణపాఠాలు నేర్చుకొని వ్యవస్థ సరయ్యే అవకాశం కూడా ఉండేదేమో. అదివేరే సంగతి. సాధారణంగానైతే సంక్షోభాలను సాధ్యమైనంతవరకు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ తప్పనట్లయితే దానినుండి గుణ పాఠాలు నేర్చుకోవాలి. సరైన గుణపాఠాలు నేర్చుకొని కొత్తపద్దతుల్లో ముందుకెళితే సంక్షోభంతో కూడా వ్యవస్థకు మేలు జరుగుతుంది.

ఇప్పుడు ఈ సంక్షోభ సమయాన మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం:
1. ఐటి పేరు మీద మనదేశంలో, బయటిదేశాల్లో మనవాళ్ళు చేసే పని మనది కాదు.
2. జీతభత్యాలు పెరగడం మాత్రమే అభివృద్ది కాదు. ఉదాహరణకు మనం కార్లు కొనగలుగుతున్నాము కానీ రోడ్లు లేవు. గేటెడ్ కమ్యూనిటీస్, స్పెషల్ ఎకనామిక్ జోన్లు అభివృద్దికి సూచికలుగా కాకుండా అంతరాలను సూచిస్తాయి.

ఇప్పటిదాకా బయటిదేశాలకు పనిచేసిన మన మానవవనరులను మనదేశానికొరకు పనిచేయించే ప్రణాళికలు తయారుచేయాలి. మన ప్రభుత్వం తన పరిపాలనకవసరమైన కొత్త ఐటి ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా నిరుద్యోగిత పెరగకుండా చూడాలి. ఆ అవసరం మనదేశంలో చాలా ఉంది. యెవడో ప్రపంచ బ్యాంకు వాడొచ్చి మీ ఫలానా డిపార్టుమెంటు ఆధునికీకరణకు అప్పులిస్తామని మన నాయకులను టెంప్ట్ చేసేదాకా మన వాళ్ళు కదలరు. ఆ ప్రపంచ బ్యాంకు ఏజంట్లేమో ఎలాగూ కమీషన్లకొరకు అంచనాలను ఎక్కువగా చేసి చూపిస్తారు. మనం భరించలేని ప్రొప్రయిటరీ ప్రొడక్స్‌ని అంటగడతారు. ఇతర ఏదేశాల కంపెనీలు మన ప్రాజెక్టులను చేపట్టినా అదే విధంగా ఖరీదు ఎక్కువే అవుతుంది.

అందుకని ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్లను ఇంకా అభివృద్ది పరచి తక్కువ ఖర్చుతో మన ప్రభుత్వ యాజమాన్య సాఫ్ట్‌వేర్స్ అభివృద్ది చేయాలి. అభివృద్ధి చెందిన దేశాల బడ్జెట్‌తో పోలిస్తే మనదేశ బడ్జెట్లు, ఆర్ధిక వనరులు తక్కువగానే ఉంటాయి. ఈ తక్కువ బడ్జెట్లతోనే మనకు కావలసిన కీలక, ప్రాధాన్యతా రంగాలను మొదలు ఐటిని ఉపయోగించి ఆధునికీకరించాలి. బహుళార్ధసాధక గుర్తింపు కార్డుల ప్రాజెక్టులు, భూ యాజమాన్య ప్రాజెక్టులను మొదలు చేపట్టాలి. తర్వాత సంక్షేమ పథకాల ప్రాజెక్టులను చేపట్టాలి. ఆర్ధిక, బ్యాంకింగ్ రంగం ఇప్పటికే ఐటిని ఉపయోగించి ఆధునికీకరణం చెందుతున్నాయి.

తక్కువ బడ్జెట్లతో ప్రాజెక్టులు చేయడానికి దేశీయ కంపెనీలు మొదలు ముందుకు రావు. కానీ ఇప్పుడు అవి సంక్షోభంలో ఉన్నాయి కాబట్టి గత్యంతరం లేక తప్పకుండా ముందుకు వస్తాయి. అవి వాటి ఉద్యోగులను ఒక మాదిరి వేతనాలకు ( భారీ మొత్తాలు కాకుండా ) పనిచేయించుకోవచ్చు కూడా. దాని వలన కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. సమాజంలో అంతరాలు ఎక్కువకాకుండా కూడా ఉంటుంది.

ఇంకో అవకాశమేమంటే ప్రైవేటు కంపెనీలకు ప్రాజెక్టులను అప్పగించకుండా ప్రభుత్వ యాజమాన్యంలోని NIC లాంటి సంస్థలను భారీగా విస్తరించి ప్రభుత్వమే తనకు కావలసిన ప్రాజెక్టులను తయారు చేసుకోవచ్చు. తద్వారా చాలా మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించ వచ్చు. ఐటిని ఉపయోగించి వ్యవస్థను సక్రమంగా, పారదర్శకంగా నిర్మించుకో వచ్చు.

మరి మన నాయకమ్మణ్యలు ఇవన్నీ చేస్తారా? ఊహూః చేయనే చేయరు. మరి ఎలా?

ఎలాగంటే ఉద్యోగాలు కావల్సిన వారే ఈ డిమాండ్‌ని మొదలు పెట్టాలి. అదొక్కటే మార్గం.

Sunday, January 25, 2009

మనిషికి ఏమి కావాలి?

1.జీవిక అవసరాలు: జీవించడానికి తిండి కావాలి. వాతావరణం నుండి రక్షించుకొనడానికి బట్టలు, ఇల్లు కావాలి.

2.లైంగిక ఆవసరాలు: సహజాతమైన కలయిక, తోడు, ప్రత్యుత్పత్తి

3. ఆత్మ అవసరాలు: తనని తాను, తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రపంచంలో తనని తెలుసుకోవడం. తన ఉనికిని తాను స్పృహలో ఉంచుకోవడం, బయటి ప్రపంచానికి వ్యక్తపరచడం, చాటించుకోవడం, నిరూపించుకోవడం.

ఇవి విడివిడిగా చెప్పుకున్నప్పటికీ నిజానికి జీవితంలో విడదీయలేనంతగా అల్లుకు పోయి ఉంటాయి. ఇవ్వన్నీ అంతిమంగా వనరులని వినియోగించుకోవడం, ఇతరులతో సంబంధాలు నెరపడం రూపంలో ప్రతిఫలిస్తాయి. సంబంధాల మూలంగా, పరిమితుల మూలంగా వనరుల వినియోగమనేది షేర్ చేసుకోవలసిన అగత్యంగా రూపుదిద్దుకొంటుంది. సంబంధాలు ఏ విధంగా ఉండాలనేది సమాజం నిర్దేశిస్తుంది. వనరుల్ని ఏ పద్దతుల్లో షేర్ చేసుకోవాలనేది చట్టంగా రూపొందుతుంది.

జీవిక, లైంగిక అవసరాలు జంతువులకు కూడా ఉంటాయి. ఆత్మ అవసరాలు మనిషికి మాత్రమే ప్రత్యేకమైనవి. నిరూపించుకోవడం, చాటించుకోవడం లాంటి స్వయం వ్యక్తీకరణాలు జంతువుల్లో కూడా ఉంటాయి. పోరాడడం, గెలువడం, మనుగడ కొరకు పోరాడడం జంతువుల్లో కూడా ఉంటుంది. మనిషిలో విశిష్టంగా ఇక మిగిలి పోయింది తెలుసుకోవడం, స్పృహలో, తదవసరమైన క్రియలో ఉండడమే.

జీవిక, లైంగిక అవసరాల వలన ప్రపంచంలో ఏ విధ్వంసం జరుగదు. ఆత్మ అవసరాలైన అహం పొడిగింపు, వ్యక్తపరచుకోవడం, కూడబెట్టడం, నిరూపించుకోవడాల మూలంగానే వైరుధ్యాలు ఏర్పడతాయి, విధ్వంసం జరుగుతుంది. తెలుసుకోవడం స్పృహలో ఉండడం, తదనుగుణ క్రియలో ఉండడం మూలాన సమతౌల్యం ఉంటుంది. జీవిక, లైంగిక అవసరాలు తీరగానే మనిషి సమాజంలో తనని నిరూపించుకోవడం కొరకు ప్రాకులాడతాడు.

జీవిక అవసరాలు కూడా అంత తేలికగా తీరవు. ప్రకృతిని పరిశీలించి, శాస్త్రాన్ని నిర్మించిన మనిషి యంత్రాల సహాయంతో శ్రమని తగ్గించుకొనే ఉపాయాలు అనేకం కనిపెట్టాడు. దానితో జీవిక అవసరాలని తేలికగా నిర్వహించుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఈ జీవిక అవసరాల కొరకు యాంత్రిక శక్తిని ఉపయోగించడమనేది కూడా ఇంకా అందరికీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. తెలివి కలవారు, చారిత్రకంగా ముందున్న వర్గాలకు మాత్రమే ఇవి అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఇంకా చాలామందికి భౌతికంగా శ్రమ పడితే తప్ప జీవిక అవసరాలు తీరే పరిస్థితి లేదు. మానవుడు సహజాత పరంగా బద్దక జీవి. శ్రమని ఎప్పటికప్పుడు తప్పించుకోజూస్తాడు. ఇలా శ్రమను తప్పించుకోవడానికి రకరకాల మాయోపాయాలను పన్నుతాడు, సామాజిక సంబంధాలను, సంస్క­­ృతిని సృష్టిస్తాడు. ఇంత సోమరి మానవుడు కూడా గుట్టుచప్పుడు కాకుండా తిని పడుకొంటాడా అంటే అదీ కాదు. మళ్ళీ తన ఉనికిని ఏదో ఒక రకంగా ప్రకటించుకోవడానికి తాపత్రయపడుతూనే ఉంటాడు. దానికి రకరకాల పద్దతులను ఎంచుకొంటాడు. ఏదో రకంగా తన ఆధిపత్యాన్ని, తన ప్రత్యేకతని నిరూపించుకోవాలని పోరాటం చేస్తూనే ఉంటాడు. దాన్నే విజయమని అదే జీవిత లక్ష్యమని, జీవితాంతం దాని సాధనలోనే గడిపేస్తాడు.

ఒకరు ప్రకృతిని పరిశీలించి శాస్త్రాన్ని నిర్మిస్తారు. ఒకడు క్రొత్త వస్తువుని కనిపెడతాడు. కొందరు లలిత కళలలో ప్రావీణ్యం సంపాదిస్తారు. సాహిత్యాన్ని సృష్టిస్తారు. అందంగా కొందరు, బలంగా కొందరు తయారౌతారు, కొందరు క్రీడలలో, కొందరు నాయకత్వం వహించడంలో ప్రావీణ్యం సంపాదిస్తారు. ఇవ్వన్నీ కుదరని వారు, నేర్చుకోలేని వారు డబ్బు సంపాదించడమో, మాయోపాయాలు చేయడమో నేర్చి ఎలాగైతేనేం తమ విజయాన్ని నిరూపించుకో జూస్తారు. ఈ ఎలాగోలా తమ విజయాన్ని ఆధిపత్యాన్ని నిరూపించుకోవడమనేదే ప్రపంచంలోని విధ్వంసాలన్నిటికీ కారణం.

శ్రమ పడకుండా ఈ ఉనికి ప్రకటన, విజయం సాధించడం, ఆధిపత్య నిరూపణ అనేదే సకల అనర్దాలకు కారణం. అందరూ ఈ ఆదుర్దాలలో పడిపోయి పరుగులిడుతున్నప్పుడు జీవిక అవసరాలు తీరే అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి. దానితో మొదలు అందరిలోనూ ఆర్జనపరత్వం తలెత్తుతుంది. తనకూ, తన సంతానానికి కొన్ని తరాలవరకు ఇంకా వీలైతే తరతరాలకు జీవిక అవసరాల నిమిత్తమైనా సంపాదించి కూడబెట్టాలనే బలమైన సామాజిక పరిస్థితి తయారైనది. ఇక యెవరనే భేదం లేకుండా శాస్త్రవేత్త, ఉత్పత్తిదారు, కళాకారుడు, సాహితీవేత్త, నాయకుడు ఎవరైనా సరే డబ్బు సంపాదించే పనిలోనే ఉంటారు. తమ విశిష్టతలనన్నిటినీ డబ్బుకు దాసోహమొనరుస్తారు. మిగిలింది పరుగు పందెం. దేన్నైనా త్రొక్కేస్తూ ముందుకు సాగడమే మనిషి విధిగా మారింది.

సర్దుబాటు, సహజీవనము, పరస్పర సహకారంలో ఆధిపత్య నిరూపణకి మనిషికి ఏ అవకాశమూ లేదు. ఉనికి ప్రకటించుకోవాలనే ఆదుర్దాకి అర్ధం ఏమిటి? ఆధిపత్యాన్ని నిరూపించుకోవలసిన అవసరం ఏమిటి? ఈ కోరికలకు మూలాలేమిటి? సహజాత స్థాయిలో బ్రతకడానికి పోరాడటం వేరు. బ్రతక నేర్చిన తర్వాత శ్రమని తప్పించుకొని ఈ పోరాటాలేమిటి?

వీటికి కారణం మనిషి తనని తాను, సమాజంలో, ప్రపంచంలో తన ఉనికి సరిగ్గా అర్ధం చేసుకోకపోవడమే. అలా అర్ధం చేసుకోనంతకాలం ప్రపంచంలో ఈ పెనుగులాటలు, విధ్వంసం, యుద్దాలు, సంక్షోభాలు తప్పవు. తెలుసుకోవడం, అర్ధం చేసుకోవడం, దానికి ప్రమాణాన్ని సాధించడాన్నే మనం సత్యాన్ని చేరుకోవడమని చెప్పవచ్చు.